Sunday, July 27, 2008

దేవుడా !!!

మళ్లీ ఒక దాడి!! మతం మత్తులో మదమెక్కిన మూకల వికృత చర్యలకు సామాన్య జనం బలి. మృత్యువుకి మతం లేదు , అందరూ సమానమే, బ్రతకడం రాక డబ్బు కోసం బాంబుల బాట పట్టిన దిక్కు మాలిన మూకల వెర్రి ఆవేశానికి అమాయకుల బ్రతుకులు చితికిపోవాల్సిందేనా ? . తెగించిన వాడికి భయమేంటి .. ప్రతీ చోటా పోలీస్ వుండగలడా ? లాంటి చెత్త సమాధానాలు వినీ వినీ విసిగి పోయిన ప్రజలు భయంతో వణకటం తప్ప చేసేది ఏముంది?

సార్వభౌమత్వం పై ఈ-మేయిల్ హెచ్చరికలు వెక్కిరిస్తున్నా వోటు బ్యాంకు పద్దతులు మానటం అమాత్యులకు సాధ్యం కాదు. అగ్ర రాజ్యం లో ప్రజల ప్రాణం విలువ , మన దేశంలో ప్రాణానికి వున్న విలువ కన్నా ఎక్కువ కాబోలు, తన పై దాడిని కేవలం "ఖండించ"కుండా ... రెండు దేశాలని సర్వ నాశనం చేసి ముష్కర మూకలకీ చావు దెబ్బ రుచి చూపించగలిగింది.

షష్టి పూర్తి పిదప కూడా జాతీయ భావాలని ..మనము ఒకే దేశపు బిడ్దలమన్న ఇంగితాన్ని ఇవ్వలేని చచ్చు చదువులు , నువ్వు హిందు, నువ్వు ముస్లిమ్ అన్న భావాలని జయించ లేని దరిద్రపు ప్రజలకి వారి వారి నాయకులకి జోహార్లు. నువ్వు చర్చిలో మాత్రమే క్రైస్తవుడివి , మసీదులో ముస్లిం.. గుడిలో హిందువు ..కానీ బయట సమున్నత భారతావని బిడ్దవి ..తిండి పెట్టలేని అల్లా,జీసస్,రాముడు ఎదుటి వాళ్ళని చంపే ఆదేశాలు ఇచారా ? అని అడగలేని మత పెద్దలకి జేజేలు.

భయం లేని సమాజం లో అభివృద్ధి ..ఆనందం.. పరిఢిల్లుతుంది . ఏం చెయ్యాలో ఆలోచించే తెలివయిన వాళ్ళూ మన దేశంలో చాలా మందే వుండి వుంటారు ..ఒక్క సారి మత ..కుల రహితంగా ఆలోచించరూ..! మా మీద దయతో !! మాకూ పిల్లలు వున్నారు మేము సురక్షితంగా వుండాలంటే అగ్ర రాజ్యానికి వెళ్లాల్సిన పరిస్థితి మాత్రం తేకండి. మాకోసం కష్ట పడమనట్లేదు , కనీసం మీ పిల్లలు ..మీ మనువల కోసమయినా ఆలోచించండి..